Sunday, January 15, 2023

Rail sakthi Feb 2023

 బీ ఎలర్ట్ : నంగేళి


              "నంగేళి" ఈ పేరు ఇతిహాస గ్రంథాలలో లిఖించబడలేదు. చరిత్ర పుటల్లో ఎక్కించబడలేదు. బంధనాల ఛేదన నేపథ్యాల్లో స్థానం కల్పించబడలేదు. సాహసకార్యాల సరసనా చేర్చబడలేదు. గతం జ్ఞాపకాల కొలమానంలోనూ ఇమడ్చబడలేదు. ఐనా 'నంగేళి' పేరు నేటికీ వినబడతూనే ఉంది. సజీవంగా సమాజంలో నడయాడతూనే ఉంది. అణచబడ్డ జాతుల్లో నేడు రవికను ధరిస్తున్న ప్రతీ ఆడబిడ్డ గుండెలను తడుముతూనే ఉంది. వారి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తాఉంది. విముక్తి దిశగా వేసే ప్రతీ అడుగు మార్గమై నిలుస్తుందన్న సత్యాన్ని బోధిస్తా ఉంది. 

                అది 19వ శతాబ్ద ప్రారంభకాలం. మనుస్మృతి ఆధారంగా మనుషుల్ని వారి కులాల్ని బట్టే చూడటం కొనసాగుతోంది. ఆహార, వస్త్ర ధారణ నియమాలను నిర్ణయించి వాటి అతిక్రమణకు పాల్పడిన వారికి శిక్షలు వేయటం జరుగుతోంది. విపరీతమైన అసమానతలు రాజ్య మేలుతున్నాయి. బ్రిటీష్ వారి ఆగమనంతో మొదలయిన  విద్యా వ్యాప్తి కారణంగా మనుషులుగా కూడా గుర్తింపుకు నోచుకోని కొన్ని అస్పృశ్యకులాల మరికొన్ని శూద్రకులాల వారి జీవనాల్లో చైతన్య వంతమైన సామాజిక మార్పు చొరబడుతోంది. ఆ దిశగా ఆలోచనలు మొలకెత్త నారంభించాయి. వర్ణధర్మాన్ని నమ్మి పాలన అందిస్తున్న కేరళలోని బ్రాహ్మణ ట్రావెన్ కోర్ సంస్థానాదీశులు కుల కట్టుబాట్లను పటిష్ట పరిచే పనికి పూనుకున్నారు. సాంఘిక జీవనాల్లో మార్పులు చోటు చేసుకోకుండా నిమ్న వర్గాల్లో ఉచ్ఛస్థాయి జీవన పద్దతులు చొరబడినా నిలబడకుండా అధిమిపెట్టే ఎత్తుగడలకు తెరలేపారు. క్రింది కులాలమహిళలు పై భాగం(చెస్ట్) కప్పుకోవటం ఆనాటికి ఆప్రాతంలో వున్న వస్త్ర ధారణ పద్ధతుల్లో లేదు. ఒకవేళ ఎవరైనా శూద్రకులాలలోని మరియు అస్పృశ్య కులాలలోని ఆడవాళ్లు అలా కప్పుకోదలిస్తే పన్ను కట్టాలని " బ్రెస్ట్ టాక్స్" ను ప్రవేశ పెట్టారు. ఈ టాక్స్ నిర్ణయించటం కోసం అక్కడ అధికారి ఆ బ్రెస్ట్ టాక్స్ కట్టే మహిళ స్థనాల పరిమాణం చేతులతో కొలిచి దాని ఆధారంగా టాక్స్ నిర్ణయిస్తాడు. ఈ విధానంతో ఎవరైనా బ్రెస్ట్ టాక్స్ కట్టడానికి స్థోమతున్నా జాకెట్ ధరించే ఆలోచనా చేయలేని పరిస్థితి. 

                          ట్రావెన్ కోర్ సంస్థానంలోని తూర్పు భాగంలో ఉన్న ఛెర్తాలా గ్రామానికి చెందిన ఇఝావా (ezhava) కుల మహిళ నంగేళి. ఇఝావా కులం శూద్ర కులాలలో ఒకటి. పై భాగానికి వస్త్రం ధరిస్తుందనే సమాచారంతో బ్రెస్ట్ టాక్స్ నిర్ణయించి పన్ను వసూళ్లు చేసేందుకు అధికారి వచ్చాడు. నంగేళి తన స్థనాన్ని కోసి ఓ ఆకులోపెట్టి అధికారికి అందించింది. ఈ ఊహించని పరిణామంతో భీతిల్లిన అధికారి అక్కడ నుంచి పారిపోయాడు. స్థనాన్ని శరీరంనుంచి కోసి వేరుచేయటం వల్ల విపరీతమైన రక్తశ్రావం జరిగి నంగేళి చనిపోయింది. ఆమె దహన కార్యక్రమంలోనే అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసాడు నంగేళి భర్త. ఈ సంఘటనతో సమాజంలో పుట్టిన తిరుగుబాటు కారణంగా ట్రావెన్ కోర్ సంస్థానం " బ్రెస్ట్ టాక్స్" ను విరమించుకోవలసి వచ్చింది. 

           నంగేళి చూపిన తెగువ ఓ సమూల మార్పుకు దారితీసింది. అట్టడుగు వర్గాల స్వాభిమాన పతాకాన్ని తరతరాలు నిలబెట్టింది. గౌరవప్రదమైన సంఘజీవనాల్లో వీరూ భాగమయ్యే హోదాను అందించింది. తలెత్తుకు జీవించేందుకు చేసే ప్రయత్నం ఒక్కటే కావచ్చు,  దాని అడుగూ ఒంటరిగా కనబడొచ్చు కానీ ఆ స్ఫూర్తి వేల ఉద్దీపనాలకు నాందిగా నిలుస్తుంది. వ్యవస్థ మార్పుకు కారణమై గెలుస్తుంది.

                ---------------    మాతంగి దిలీప్ కుమార్

              ఎడిటర్ :          భీమ్ భూమి & ప్రసారం మాసపత్రికలు

Tuesday, February 16, 2021

Saturday, February 13, 2021

ప్రజా స్వామ్యము కోసం పాట

 రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో 

పార్లమెంట్ అసెంబ్లీలకు  ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఎలక్షన్లు జరుగుతాయి ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఆ ఎలెక్షన్లలోన ఎన్నెల్లో ఎన్నెల్లో 

డబ్బులు పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో 

మద్యము బహుమతులు ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో 

పంచే వాళ్ళను ఏమనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో 

నేరస్తులని అనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఆ నేరస్తుల్ని జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో 

రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో 


రాష్ట్రల లోను దేశం లోను ఎన్నెల్లో ఎన్నెల్లో 

చంద్ర బాబు నాయుడు కేసీఆర్ ఎన్నెల్లో ఎన్నెల్లో 

జగన్ మోహన్ రెడ్డి ఎన్నెల్లో ఎన్నెల్లో 

మోడీ అమిత్ షాలు ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఇంకా అనేక మంది పార్టీల వాళ్ళు ఎన్నెల్లో ఎన్నెల్లో 

ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో 

వీళ్లందరినీ జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో 

పార్లమెంట్ అసెంబ్లీలను  ఎన్నెల్లో ఎన్నెల్లో 

మన ప్రియమయిన దేశాన్ని  ఎన్నెల్లో ఎన్నెల్లో 

మన దేశ రాజ్యాంగాన్ని  ఎన్నెల్లో ఎన్నెల్లో 

కాపాడు కోవాలి  ఎన్నెల్లో ఎన్నెల్లో 

రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో 


ఎన్నికల అధికారులు ఎన్నెల్లో ఎన్నెల్లో 

కోర్టులు పోలీసులు ఎన్నెల్లో ఎన్నెల్లో 

డబ్బులు పంచె వాళ్లను ఎన్నెల్లో ఎన్నెల్లో 

మద్యము బహుమతులు పంచె వాళ్ళను ఎన్నెల్లో ఎన్నెల్లో 

జైల్లో వేయాలి  ఎన్నెల్లో ఎన్నెల్లో 

మన ప్రియమయిన దేశాన్ని  ఎన్నెల్లో ఎన్నెల్లో 

మన దేశ రాజ్యాంగాన్ని  ఎన్నెల్లో ఎన్నెల్లో 

కాపాడాలి కాపాడాలి   ఎన్నెల్లో ఎన్నెల్లో 

రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో 


వాళ్ళు చేయలేక పొతే ఎన్నెల్లో ఎన్నెల్లో

ఎర్రజెండా నీలి జెండాలు పట్టుకొని ఎన్నెల్లో ఎన్నెల్లో

ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో

సామాజిక ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో

మనమే చేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో

పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నెల్లో ఎన్నెల్లో

బహుజనులు శ్రామికులే వెళ్ళాలి ఎన్నెల్లో ఎన్నెల్లో

మన దేశ రాజ్యాంగాన్ని  ఎన్నెల్లో ఎన్నెల్లో 

కాపాడు కోవాలి  ఎన్నెల్లో ఎన్నెల్లో 

రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో


అంబెడ్కర్ గారికి  ఎన్నెల్లో ఎన్నెల్లో

భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు ఎన్నెల్లో ఎన్నెల్లో

అమర వీరులందరికి ఎన్నెల్లో ఎన్నెల్లో

జోహార్లు జోహార్లు ఎన్నెల్లో ఎన్నెల్లో


రావనా సెందనలో ఎన్నెలో

రాజా నీకొందనలో  ఎన్నెల్లో

----కాము 14.2.2021

alfa edison

 

February 14, 2020 
Shared with Public
Public
May be an image of 1 person
"ప్రపంచాన్ని చీకట్ల నుండి కాపాడిన ఒక యోధుని కథ---------------------------------------------
1855 మిషికాన్ లోని పోర్టుహ్యూరాన్ ప్రాంతం,
8 యేండ్ల పిల్లవాడి చేయిపట్టుకొని పాఠశాల నుండి ఆ పిల్లాడి అమ్మ దగ్గరకు రుసరుసలాడుతూ వచ్చింది ఒక లేడీటీచర్.... వస్తూనే ఆ అబ్బాయి తల్లిని చూస్తూ..ఏమ్మా..ఎన్నిసార్లు లెటర్స్ రాయాలి?? మీ అబ్బాయి ఒక మంద బుద్ది గలవాడు.. వాడికి చదువు చెప్పడం మావల్ల కాదని. ఇంక బడికి పంపకండి... ఇంట్లోనే వుంచుకొని ఏమైనా పనులు నేర్పించుకోండి. మళ్ళీ బడికి పంపవద్దు అని చెప్పి, అక్కడ నుండి వెళ్ళి పోయింది.. ఆమె వెళ్ళిన పదినిమిషాలకు తేరుకుంది ఆ తల్లి.. కళ్ళ నిండా నీరు కమ్ముతుండగా.. అమాయకంగా తన వంక చూస్తున్న తన కొడుకు కళ్ళలోనికి చూసింది. ఏమనుకుందో ఏమో? వాడిని గట్టిగా కౌగిలించుకుంది. నిజమే ఆ అబ్బాయికి ADHD అనే మానసికవ్యాధివుంది. అందరి పిల్లలలా ఆ అబ్బాయి తొందరగా నేర్చుకోలేడు, అర్థం చేసుకోలేడు. అదీగాక ఏడవ సంతానంలో చివరివాడతడు. తండ్రి త్రాగుడికి అలవాటై ఎటో వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనల నుండి తేరుకొన్న వాళ్ళ అమ్మ వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది.
ఆ రాత్రంతా వాడి గురించి ఆలోచించింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఇంటినే ఒక పాఠశాలగా మార్చేసింది. తనే టీచర్ అయింది. ఆ పిల్లాడికి ఇల్లే ఒక ప్రయోగశాల అయింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ప్రపంచ చీకట్లను ప్రారద్రోలే ఒక మహా వెలుగవుతుందని బహుశా ఆమె ఊహించి వుండదు.
ఆ పిల్లాడు ప్రతిదీ పరీక్షించడం, పరీక్షించిన దానిని తయారు చేయాలనుకోవడం దినచర్యగా మారింది. ఎప్పుడూ ఏదోక ప్రయోగం చేస్తుండేవాడు.
పదేళ్ళు వచ్చేసరికే పేదరికపు కష్టాలెక్కువైనాయి. డబ్బుల కోసం న్యూస్ పేపర్లు వేయడం మొదలు పెట్టాడు. స్వీట్స్ అమ్మసాగాడు. ఆ వచ్చిన డబ్బులతో ప్రయోగాలు చేయసాగాడు. తన 12 ఏళ్ళ వయస్సులో అనుకోకుండా ఒక స్టేషన్ మాష్టర్ కూతురును కాపాడడంతో రైల్వేలో చిన్నపని సంపాదించాడు. అక్కడే టెలిగ్రఫీ నేర్చుకొన్నాడు.1861లో అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు తను కనిపెట్టిన ముద్రణా యంత్రంతో "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్ "అనే చిన్నపాటి వార్తాపత్రికను నడిపాడు. రైల్వే బోగినే ప్రయోగశాలగా మార్చుకున్న ఆ పిల్లాడు అనుకోకుండా రైల్ లో అగ్ని ప్రమాదానికి కారకుడైనాడు..ఈ ప్రమాదంతో తన వినికిడి శక్తిని కోల్పోయాడు. రైల్వే అధికారులు అతనిని పని నుండీ తీసేసారు. ముద్రణా యంత్రాన్ని మండుతున్న మంటలలో వేయడంతో అదీ కాలిపోయింది.
అయినా పరిశోధనలు ఆపలేదు.1862లో తన 16 యేట టెలిగ్రాఫ్ కనుగొన్నాడు. 1868లో దానికి పేటెంట్ హక్కు పొందాడు. ఒక స్టాక్ ఎక్ఛేంజ్ లో పనికి కుదిరిన తరువాత తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్మకానికి పెట్టాడు. ఏదో చిన్నమొత్తం వస్తుందనుకున్న ఆ కుర్రాడికి ఏకంగా $40000 లభించింది. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ డబ్బుతో పరిశోధనలపై ధృష్టి పెట్టాడు..1871లో ఫోనోగ్రాఫ్ కనుగొన్నాడు. 1878లో అతను కనిపెట్టిన ఎలక్ట్రిక్ బల్బ్ తో ఆయన జీవితమే మారిపోయింది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేర్చింది.
1887-1889 మధ్యకాలంలో టైప్ రైటర్ ,ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా కనుగొన్నాడు.1882లో అమెరికాలో మొదటి విద్యుత్ క్షేత్రం నెలకొల్పాడు. 1889 లో పారిస్ ఆవిష్కరణల ఎగ్జిబిషన్ కమ్ పేటెంట్ కార్యక్రమంలో 90% పరికరాలు ఈయన రూపొందించినవే.
ఇంతకీ ఇతనెవరనుకుంటున్నారా?? థామస్ అల్వా ఎడిసన్, ప్రపంచానికి వెలుగులు ఇచ్చిన మేధావి. మనం ఇప్పుడు ఉపయోగించే చాలా పరికరాలు ఆయన రూపొందించనవే. మైనింగ్, రబ్బరు, బ్యాటరీ, సిమెంట్ మొదలగు పరిశ్రమలలో ఆయన రూపొందించిన రక్షణ కవచాలే ఎక్కువ. 1847 ఫిబ్రవరి-11 న పుట్టిన థామస్ అల్వా ఎడిసన్ 1931లో చనిపోయే వరకు దాదాపు 1300 పేటెంట్స్ పొందాడు. 2500 కోట్ల ఆస్థిని కలిగివున్నారు.
మందబుద్ధి వాడు చదువుకు పనికిరాడని పాఠశాల తిరస్కరించినా, అమ్మ దగ్గర చదువుకొని, ఎటువంటి డిగ్రీ లేకుండా ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలు చేసిన అతి సామాన్యుడు. ప్రపంచమంతా ఆయనకు రుణపడివుంది.
"ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చరిత్రను పిల్లలకు తెలియచేద్దాం."
(From Madhusudana Rao Mamidi wall)

Saturday, February 6, 2021

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందాం

 



విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందాం

జనవరి 26న దేశరాజధానిలో జరిగిన ‘రైతు ర్యాలీ’పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా కేంద్ర క్యాబినెట్‌ ఆంధ్రప్రదేశ్‌పై పిడుగుపాటు తీర్మానాన్ని ఆమోదిం చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వ్యూహాత్మక అమ్మకం పేరుతో నూరు శాతం అమ్మకానికి పెట్టింది. దేశంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకంగా పనిచేస్తున్న విశాఖ స్టీల్‌ను విదేశీ, స్వదేశీ ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మ డంవల్ల భారతదేశం స్వయం సమృద్ధి ఎలా సాధిస్తుందో భారత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీకి వుంది.

కేంద్ర ప్రభుత్వ మాజీ క్యాబినెట్‌ మంత్రి, నేడు బీజేపీ ప్రతినిధిగా వున్న సుజనా చౌదరి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వ్యూహాత్మక అమ్మకం వల్ల యాజమాన్యం మాత్రమే మారుతుందని, సకాలంలో సిక్‌ కాకుండా కాపాడవచ్చని వాదిస్తున్నారు. వీరి వాదన నేతి బీరకాయలో నెయ్యి చందగా వుంది. 3 లక్షల కోట్ల విలువగల విశాఖ స్టీల్‌ ప్రజా సంపదను కార్పొరేట్లకు తరలించడాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. రెండు లక్షల కోట్ల విలువగల్గిన విశాఖ స్టీల్‌ భూములను కేవలం మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలకు తమ అనుయాయులకు కట్టబెట్టాలనే బీజేపీ కుట్రను దాస్తున్నారు.

గతంలో మందుల పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐడీపీఎల్‌ను మూసివేసి పోటీలేకుండా చేయడంతో నేడు ప్రైవేట్‌ మందుల కంపెనీలు అనేక రెట్లకు మందుల ధరలు పెంచి ప్రజల మూల్గులు పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మార్కెట్లో పోటీ పడకుండా చేయడమే నేడు బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. విశాఖ స్టీల్‌కు నష్టాలు వస్తున్నాయనీ, సమర్ధవంతంగా పనిచేయడం లేదనీ, అమ్మేయడానికి ఇదే మంచి సమయమని బీజేపీ నాయకులు చేసే ప్రచారం పచ్చి అబద్ధం. 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రారంభంలో 1.2 మిలి యన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తికిగాను రూ. 5వేల కోట్లలోపు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. కానీ దేశంలో ఇతర భిలాయ్, బొకారో లాంటి కర్మాగారాలన్నింటికీ  కేంద్రం పూర్తిగా పెట్టుబడులు సమకూర్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 3.2 మిలియన్‌ టన్నుల నుంచి 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి రూ. 12,500 కోట్ల రూపాయలు సొంత నిధులతో విస్తరణ చేసింది. దీనిలో రూ. 6 వేల కోట్లు ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేయవలసి వచ్చింది. దాని వడ్డీల భారం నేడు ఎదుర్కొంటున్నది. దీనితో పాటు 6.3 మిలియన్‌ టన్నులనుంచి 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం పెంచడానికి మరో రూ. 9 వేల కోట్లు అదనంగా విస్తరణ నేడు సాగుతున్నది. ఈ విస్తరణలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 

2004–05 ఒక సంవత్సరంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 2,008 కోట్లు లాభాలొచ్చాయి. 2018–19 సంవత్సరంలోనే రూ. 20,884 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అంతర్జాతీయ ధరలనుబట్టి ఉక్కు అమ్మకాల్లో ఒడిదుడుకులుంటాయి. ఈ సంవత్సరం కరోనా కాలంలో నష్టాలు వస్తాయి కాబట్టి  ప్రైవేట్‌ చేస్తామనడం దుర్మార్గం. మరోవైపున విశాఖ స్టీల్‌ పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 40 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించింది. దీనిని సమర్ధత కాదంటారా? 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభంలో అనేక భారీ స్టీల్‌ప్లాంట్లు మూతబడ్డాయి. ఎస్సార్‌ స్టీల్స్‌ రూ. 50 వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి కంపెనీని మూసి వేసింది. సమర్థవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కుట్ర చేస్తున్నది.

‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’’ నినాదంతో 1966 నవంబర్‌ 1వ తేదీన విశాఖపట్నం పోస్టాఫీసు వద్ద 9 మంది పోలీసు కాల్పుల్లో మరణించినప్పటి నుంచి అదే నెలలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. 20 వేల మంది తమ భూములిచ్చారు. మన దేశంలోని సముద్రతీర ప్రాంతంలో వున్న ఏకైక ప్లాంట్‌. వందలాది మంది పర్మనెంట్, కాంట్రాక్టు, ఆఫీసర్లతో సహా ప్రాణాలు త్యాగం చేసిన ఫలితమే నేటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అభివృద్ధికి కీలకం.

1991 నుంచి కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు అవలంబిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ వారు ఎవరు తీసుకున్నా లాభాలు బాగా గడించవచ్చు. దేశీ, విదేశీ ప్రైవేట్‌ కంపెనీల కళ్లు ఆనాటి నుంచి విశాఖ స్టీల్‌ మీద పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా బలహీనపర్చాలని అనేక తప్పుడు పద్ధతులు అవలంబించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చడానికి గత ఆరేళ్ల కాలంలో బీజేపీ ఏ విధంగానూ సహకరించలేదు. ఒడిశా నుంచి గనుల కోసం ఓఎండీసీకి రూ. 361 కోట్లమేరకు విశాఖ స్టీల్‌ నిధులు ఖర్చుచేశాం. గతంలోని యాజమాన్యం మైనింగ్‌ చట్టాన్ని అతిక్రమించినందుకు విశాఖ స్టీల్‌ రూ. 400 కోట్లు జరిమానా చెల్లించింది. ఓఎండీసీని కొని 10 సంవత్సరాలైనా ఒక్క టన్ను కూడా ఇనుప ఖనిజం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నేటికీ రాలేదు. 

సొంత గనులు లేనందువల్ల 2018–19 ఒక్క సంవత్సరంలోనే ఇతర స్టీల్‌ప్లాంట్‌ల కంటే రూ. 2,002 కోట్లు అదనంగా విశాఖ స్టీల్‌ చెల్లించింది. ఇతర స్టీల్‌ప్లాంట్లు తమ సొంత గనుల్లో తవ్వి తీసుకోవడానికి టన్నుకు రూ. 700 ఖర్చవుతుంది. కానీ విశాఖ స్టీల్‌ ముడి ఖనిజాన్ని టన్ను రూ. 7,500కు గత నెలలో చెల్లించింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని సంతృప్తిపరచడానికి యూపీలోని రాయబరేలీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిధులతో రైల్‌ ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ను రూ. 1,683 కోట్లతో నిర్మించారు. కానీ నేటికీ ఎటువంటి ఉత్పత్తిలేదు. ఈ డబ్బులంతా గంగలో పోసినట్లే. గంగవరం పోర్టు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో నడిచివుంటే ప్రతి యేటా స్టీల్‌ప్లాంట్‌కు రూ. 500 కోట్లు ఆదాయం వచ్చేది. ప్రభుత్వ విధానాల వల్లనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన వేలాది కోట్ల లాభాలు తగ్గిపోయాయి. విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించడానికి ఎన్ని తప్పుడు పద్ధతులు అవలంబించినా తట్టుకొని నేటికీ వేగంగా ముందుకు సాగుతున్నది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గతంలో అనేకసార్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేసి ప్రభుత్వాలు భంగపడ్డాయి. అదే పరిస్థితి నేడు బీజేపీకి దాపురిస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటారు. భారతీయ జనతా పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోవాలి. పోరాడి సాధిం చుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అవసరం అయితే మరలా ప్రాణాలు అర్పించయినా కాపాడుకోవడం నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వ్యూహా త్మక అమ్మకం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకొనే వరకు పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాలి. రాష్ట్రవ్యాప్త బంద్‌లు, నిరసనలు, ధర్నాలు నిరంతరం సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తినివ్వాలి. విశాఖ స్టీల్‌ కార్మికులు, ప్రజలు సమైక్య ఉద్యమాలకు సిద్ధంకావాలని కోరుతున్నాం.

సీహెచ్‌. నరసింగరావు 
 సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు